Tuesday, March 29, 2022

దేశంలో తగ్గుతున్న పశుసంపద – 19 వ పశుగణన వివరాలు

 దేశంలో తగ్గుతున్న పశుసంపద – 19 వ పశుగణన వివరాలు

    దేశంలో పశుసంపద వ్యవసాయ అనుబంధ రంగముగా ఉంటూ రైతుకు సత్వరఖర్చులకు ఆదాయాన్ని సమకురుస్తూ గ్రామీణ ప్రజలకు విలువైన పోషకాలను అందిస్తూ ముఖ్య భూమికను పోషిస్తుంది. ప్రస్తుత ధరల ఆధారంగా పశు పోషణ రంగం, వ్యవసాయ సంబంధిత రంగాలలో 25.6% విలువైన ఉత్పత్తులను అందిస్తుంది. మొత్తం దేశస్థూల ఉత్పత్తిలో 2012-13 ప్రస్తుత ధరల ఆధారంగా 4.11% విలువల్ని అందిస్తూ దేశఅభివృద్ధికి తోడ్పడుతుంది. ఇలాంటి పశు పోషణ రంగానికి చేయుత నివ్వటానికి, సరియైన మేత, వైద్యం మరియు యాంత్రికరణ చేపట్టుటకు దేశంలో ఉన్నపశు  సంఖ్య వివరాలు చాలాఅవసరం. ఈ వివరాలు తెలుసుకోవడానికి 1919 మొదటిసారిగా పశుగణన చేపట్టడం జరిగింది. ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి దేశంలో ఉన్న అన్ని రకాల పశువులు, కోళ్ళు మరియు అందుబాటులో ఉన్న యాంత్రికరణ మొదలగు విషయాలను క్రోడీకరించడం జరుగుతుంది.

2012లో చేపట్టిన 19వ పశుగణన వివరాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ గణనలో గో జాతి, గేదె జాతి పశువులు, గొర్రెలు, మేకలు, కుక్కలు, కుందేలు తదితర పశువులు మరియు కోళ్ళను పరిగణలోకి తీసుకోవటం జరిగింది.

2012 నాటికీ దేశంలోని మొత్తం పశుసంపద 512.05 మిలియన్లు కలదు. ఇది క్రితం పశుగణనతో (2007) పోల్చితే 3.33% తక్కువ. గుజరాత్ (15.36%), ఉత్తరప్రదేశ్ (14.01%), అస్సాం (10.77%), పంజాబ్ (9.57%), బీహార్ (8.56%), సిక్కిం (7.96%), మేఘాలయ (7.41%) మరియు చత్తీస్ ఘడ్ (4.34%) రాష్ట్రాలు పశు జనాభాలో వృద్ధిని కనబరిచాయి.

దేశంలో మొత్తం గో/ జాతి(గో, గేదె, మిథున్, జడలబర్రె) ల సంఖ్య 2012 నాటికి 299.9 మిలియన్లు నమోదు అయినప్పటికీ ఇది 2007 తో పోల్చితే 1.57% తక్కువ. కాని పాలిచ్చే సామర్థ్యం గల పశువుల (ఆవులు, గేదెలు) సంఖ్య 6.75% వృద్ధితో 118.59 మిలియన్ అయ్యాయి. అందులో ప్రస్తుతం పాలిచ్చే పాడి (ఆవులు, గేదెలు) పశువులు 4.51% వృద్దితో 80.52 మిలియన్లు అయ్యాయి. గత 2007 పశు గణనతో పోల్చితే ఈసారి ఆవులు మరియు గేదెల సంఖ్య 6.52% మరియు 7.99% వృద్దితో వరుసగా 122.9 మిలియన్, 92.5 మిలియన్లుగా ఉన్నాయి.

దేశంలో మొత్తం గేదెజాతి పశువుల సంఖ్య 2007 లో 105.3 మిలియన్ నుండి 2012 కు 3.19% వృద్ధితో 108.7 మిలియన్ కు చేరుకుంది. సంకరజాతి/విదేశీ పాడి పశువుల సంఖ్య గణనీయంగా 34.78% పెరిగింది.  14.4 మిలియన్ల నుండి 19.9 మిలియన్లు కు 34.78% వృద్ది నమోదు అయింది. కృత్రిమ గర్భధారణ, అధికపాలిచ్చే మేలిజాతి విదేశీ పశువుల దిగుమతి మరియు వాటి పై గల ప్రత్యేక శ్రద్ధ దీనికి కారణమై ఉండవచ్చు. కాని దేశీయ పాడిపశువుల పెరుగుదల చాలా స్వల్పంగా 0.17% మాత్రమే కాగా వాటి సంఖ్య 48.12మిలియన్లుగా ఉంది. పాలిచ్చే గేదెల సంఖ్య 4.95% వృద్ధితో 51.05 మిలియన్లు గా ఉంది. తక్కువ పాలిచ్చే దేశీయ పశువులను తీసివేయుట, భారమైన పశు దాణాక ఖర్చులు, యాంత్రికరణ మరియు మేలైన అంభోతులు లేకపోవటంతో మొదలైన కారణాలతో దేశీయ పశువులపై ఆదరణ కరవవుతుంది. పాడి పశువులలో కూడా అధిక పాలు ఇచ్చే సంకరజాతి/విదేశీ జాతి పాడి పశువులపైనే ఎక్కువ ద్రుష్టి పెడుతున్నాడు. కాని మంచి లక్షణాలు కలిగిన  దేశీయ పశుజాతులను కాపాడుకోవలసిన అవసరం చాలా ఉంది. లేగ దూడల సంఖ్య కూడా బాగ తగ్గుతూ వస్తుంది. పెరిగిన  దాణా ఖర్చులు, పశువులను మేపడానికి, పాకలలో పనిచేయడానికి కూలీల వ్యయభారంతో రైతు లేగ దూడలను అమ్మేస్తున్నారు, దీనివల్ల భవిష్యత్తులో పాడిపశువుల సంఖ్య గణనీయంగా తగ్గేప్రమాదం ఉంది.

మధ్యప్రదేశ్ (10.27%), ఉత్తరప్రదేశ్ (10.24%) లలో అత్యధిక గోజాతి పశువులుండగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ 9.59 మిలియన్ (5.03% ) పశువులతో 11 స్థానంలో ఉంది. ఇది 2007 గణనకు 14.50% తగ్గుదల. గేదె జాతి పశువులు ఉత్తరప్రదేశ్ (28.17%), రాజస్థాన్ (11.94%) లో అధికంగా ఉండగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ 10.62  మిలియన్ (9.77%) గేదెలతో 3వ స్థానంలో ఉంది, కాని ఇది 2007 గణనకు 19.96% తక్కువ.

దేశంలో మొత్తం గొర్రెల జనాభా 2012 నాటికి 65.06 మిలియన్లు కాగా ఇది 2007 గణన కంటే 9.07% తక్కువ. అవిభక్త ఆంధ్రప్రదేశ్ గొర్రెల జనాభాలో 3.35% వృద్ధి సాదించి 26.39 మిలియన్లతో (40.57%) మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో కర్ణాటక (14.73% - 9.58 మిలియన్లు) ఉంది. గొర్రెల పెంపకం ఇప్పటికీ సాంప్రదాయ గొర్రెల కాపరుల చేతిలో ఉండటం, చాలా వరకు సాంప్రదాయ వృత్తిని వదలిపెట్టుట, మేతమేయుటకు భూమి లేకుండుట వీటికి కారణాలు కావచ్చు. కాని వీటి మాంసానికి ఉన్న డిమాండ్, వాటి మాంసకృత్తులలో విలువల్ని దృష్టిలో పెట్టుకొని వీటిని పెంచవలసిన ఆవశ్యకత ఉంది. మేకల సంఖ్య కూడా 3.82% తగ్గి 2012 నాటికి 135.7 మిలియన్లుగా ఉంది. రాజస్తాన్ (16.03%), ఉత్తరప్రదేశ్ (11.53%) లో అధిక మేకలు ఉండగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో 9.07 మిలియన్ల (6.71%) తో 5వ స్థానంలో ఉంది. ఇది రాష్టంలో 2007లోకన్నా 5.76% తక్కువ.

పందుల సంఖ్య 2007 గణన కంటే 7.45% తగ్గి 10.29 మిలియన్లుగా ఉంది. ఇవి ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలలో కేంద్రికృతమై ఉన్నాయి. పందుల సంఖ్యలో అస్సాం (15.89%) మెదటి స్థానంలో ఉండగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ 10.10% తగ్గుదలతో 0.3 మిలియన్లతో 9వ స్థానంలో ఉంది.

గుర్రాలు, పోనీల సంఖ్య దేశంలో 2.08 వృద్దితో 2012 నాటికి 0.62 మిలియన్లు గా ఉంది. మ్యూల్స్ (సంకరజాతి గుర్రాల) సంఖ్య గణనీయంగా 43.34% పెరిగి 0.19 మిలియన్లుగా ఉంది. ఇప్పటికి ఉత్తర భారతదేశంలో కొండ ప్రాంతాలకు సరైన రవాణాలేక వీటిపై ఆధారపడుట వీటి సంఖ్య పెరగడానికి కారణాలై ఉండవచ్చు. ఇవి ఎక్కువగా ఉత్తరప్రదేశ్ (24.31%), జమ్ముకాశ్మీర్ (23.13%) రాష్టాలలో ఉన్నాయి. గాడిదల జనాభా కూడా గతంలో కన్నా 27.22% పెరిగి 0.32 మిలియన్లు ఉంది. రాజస్తాన్ (25.56%), ఉత్తరప్రదేశ్ (17.77%) లో వీటి జనాభా ఎక్కువ.

ఒంటెల జనాభా గత గణాంకాలతో పోలిస్తే 22.48% తగ్గి 0.4 మిలియన్లు మాత్రమే ఉన్నాయి. ఇవి రాజస్థాన్ (81.37%) రాష్ట్రానికే కేంద్రికృతమైనప్పటికి అక్కడకూడా వీటి జనాభా గత సంత్సరాలకంటే తక్కువగానే ఉంది.కోళ్ళ సంఖ్య 12.39% వృద్ధితో 729.2మిలియన్ల కు చేరుకుంది. కుందేలుల సంఖ్య  2007 తో పోలిస్తే 0.425 మిలియన్లు నుండి ఈ సారి 39.55% వృద్ది రేటుతో 0.592 మిలియన్లకు చేరింది. కుందేళ్ల పెంపకము పై ప్రజలకు గల ఆసక్తి, వాటి త్వరిత సంతానోత్పత్తి సమర్త్యం వీటికి కారణాలై ఉండచ్చు.

2007 నుండి 2012 వరకు దేశ పశుగణనలో మార్పులు

క్ర.సం

జాతి

భారతదేశం

2007 (మిలియన్లలో)

2012 (మిలియన్లలో)

% మార్పు

1

గో జాతి(సంకర/విదేశీ)

33.06

39.73

+20.18

2

గో జాతి(దేశీయ)

166.01

151.17

-4.10

3

మొత్తం గో జాతి

199.07

190.90

-4.1

4

గేదె జాతి

105.34

108.702

+3.19

5

గొర్రెలు

71.56

65.07

-9.07

6

మేకలు

140.54

135.17

-3.82

 

మొత్తం పశువులు

529.69

512.06

-3.33

7

లేయర్ కోళ్ళు

 

214.24

 

8

బ్రాయిలర్ కోళ్ళు

 

282.16

 

9

మొత్తం పౌల్ట్రీ

648.82

729.21

+12.39







No comments:

Post a Comment

National Livestock Mission

నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాలు రైతుల ఆదాయం పెంచేందుకు నిరుద్యోగులకు ఉపాధి ఏర్పరచాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ప...